*మార్కెట్లో హ్యాండ్బ్యాగ్ చోరీ: ముగ్గురు దొంగల అరెస్టు*
హంస కలం వార్త,
తెలుగు దినపత్రిక .. 03 – ఫిబ్రవరి -26–
కూరగాయల మార్కెట్లో రద్దీని ఆసరాగా చేసుకుని మహిళల హ్యాండ్బ్యాగులు దొంగిలిస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్ఓ కె.వి.సుబ్బరావు తెలిపారు.మూసాపేట ప్రగతినగర్కు చెందిన లోపెట్టి నాగమణి గత నెల 13న రాత్రి స్థానిక మార్కెట్లో కూరగాయలు కొంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె హ్యాండ్బ్యాగ్ను అపహరించారు. అందులో రూ.40 వేల నగదు ఉన్నట్లు బాధితురాలు జనవరి 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి మంగళవారం రోజు ఉదయం వై జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ఫతేనగర్, సనత్నగర్కు చెందిన బండారి షాలిని(34), గంబూ మహేశ్వరి(43), ఉప్పు సరిత(38)గా గుర్తించారు. నిందితులు రద్దీగా ఉండే ప్రాంతాలు, జాతరలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్హెచ్ఓ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మార్కెట్లు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లే మహిళలు తమ వెంట తెచ్చుకునే బ్యాగులు, నగదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.